ఆందోళనకారులు ఎంతముఖ్యమో విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది భద్రత కూడా..-సుప్రీం కోర్టు
అమరావతి: ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలపడం ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. సోమవారం పలు పిటిషన్లను విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. నిరసనల్లో గాయపడిన ఆందోళనకారులు ఎంతముఖ్యమో విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది భద్రత కూడా అంతే ప్రధానమని ధర్మాసనం పేర్కొంది. ప్రజలు, పోలీసులు ఇద్దరూ స్వీయ క్రమశిక్షణ పాటించినప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. నిరసనలను నియంత్రించేందుకు విధుల్లో ఉన్న పోలీసులకు తగిన రక్షణ పరికరాలు, హెల్మెట్లు, భద్రతా సామగ్రి అందించారా లేదా అనే విషయంపైనా రాష్ట్ర ప్రభుత్వాలను వివరణ కోరే అంశాన్నీ పరిశీలిస్తామని తెలిపింది. ఆందోళనల సమయంలో పోలీసుల చర్యలపై దేశవ్యాప్తంగా ఒకే విధమైన ప్రామాణిక విధానాలు(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్) అవసరమని పలువురు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ అనుమతి పొందిన ప్రదేశాల్లో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందంది. అయితే హింసకు పాల్పడిన సంఘ విద్రోహులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది.
పోలీసుల కుటుంబాల పిటిషన్లు:- నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో ఢిల్లీలోని పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు బలప్రయోగానికి పాల్పడ్డారని,అలాగే బిహార్లోని సివాన్లో పోలీసుల కాల్పుల ఆరోపణలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. వీటితోపాటు పోలీసులపైనా నిరసనకారులు దాడులకు పాల్పడ్డారని, వారి కుటుంబాల తరఫున కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ అంశాలను సమగ్రంగా పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది.

