సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్-జిల్లా జిల్లా జడ్జీ నరసింహమూర్తి
నెల్లూరు: ప్రజలకు సత్వర న్యాయం అందించడంతో పాటు సమయం, డబ్బు ఆదా చేసుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ ఎంతో ఉపయోగకరం. సెప్టెంబర్ 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ. నరసింహమూర్తి పిలుపునిచ్చారు.సోమవారం సాయంత్రం స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వై. జే. పద్మశ్రీ తో కలసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ, గతంలో సాధించిన ఫలితాలు, పరిష్కరించనున్న కేసుల వివరాలను ఆయన వెల్లడించారు.
సుప్రీంకోర్టు, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA), ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆధ్వర్యంలోని ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (APSLSA) ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం నాలుగు జాతీయ లోక్ అదాలత్లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సివిల్ కేసులు, మున్సిపల్ కేసులు, భూ సేకరణ కేసులు, వివాహ సంబంధ కేసులు, ఆర్బిట్రేషన్, మీడియేషన్, కాంపౌండింగ్ కేసులు, ట్రాఫిక్ చలాన్లు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ సెక్షన్ 138 కేసులు, చట్టపరంగా రాజీకి వీలున్న క్రిమినల్ కేసులు తదితర కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు.
కేసుల పరిష్కారానికి అర్హత ఉన్న కక్షిదారులు పరస్పర రాజీకి ముందుకు వచ్చి సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.నరసింహమూర్తి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

