7 వేల మంది విద్యార్థులకు సొంత నిధులతో సైకిళ్ల పంపిణీ చేసిన మంత్రి నారాయణ
తండ్రి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు పొంగూరు సింధుర ..
నెల్లూరు: “నేను పేదరికాన్ని పుస్తకాల్లో చదవలేదు… జీవితంలో అనుభవించాను. గుడిసెలో పుట్టి, కష్టాల్లో పెరిగి, హరనాథపురం నుంచి వీఆర్సీ వరకు కాలినడకన వెళ్లి చదివిన రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. నా లాంటి కష్టాలు ఈ తరం పిల్లలకు ఉండకూడదనే ఉద్దేశంతోనే 10 వేల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రూ.6 కోట్ల వ్యయంతో ఉచిత సైకిళ్లు అందిస్తున్నాం” అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు.
సొంత నిధులతో ఉచితంగా:- నెల్లూరు నగరంలోని వీఆర్సీ గ్రౌండ్లో సోమవారం నిర్వహించిన ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జాతరను తలపించింది. నెల్లూరు నగర, రూరల్ నియోజకవర్గాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 7 వేల మంది విద్యార్థులకు మంత్రి నారాయణ కుటుంబం సొంత నిధులతో ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసింది.
మంత్రి కుమార్తె పొంగూరు సింధుర మాట్లాడుతూ, తన తండ్రి సాధారణ కుటుంబం నుంచి వచ్చి మూడు కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వెళ్లి చదువుకున్నారని గుర్తుచేశారు. తనలాంటి కష్టాలు పేద పిల్లలకు రాకూడదనే ఉద్దేశంతోనే 10 వేల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు అందిస్తున్నారని చెప్పారు. ఆయన స్ఫూర్తితో తామూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని తెలిపారు.

