జిల్లాలో బారిన పడిన రైతులకు అదుకునేందుకు రూ.1335.69 నిధులు అవసరం-కలెక్టర్
కరవు పరిస్థితులను వివరించే ఫొటోల పరిశీలించిన సభ్యులు..
నెల్లూరు: జిల్లాలోని మెట్ట ప్రాంతంలో నెలకొన్న కరవు పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేయాలని కేంద్ర కరవు బృంద సభ్యులను జిల్లా కలెక్టర్ హరినారాయణన్ కోరారు. జిల్లాలో కరవు పరిస్థితులను అంచనా వేయడానికి విచ్చేసిన కేంద్ర బృంద సభ్యులు మన్ను జి ఉపాధ్యాయ్, ఎస్సి కష్యప్, మదన్ మోహన్ మౌర్య, బి అనురాధ బుధవారం కలెక్టరేట్లోని శంకరన్ సమావేశ మందిరంలో కలెక్టర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో నెలకొన్న కరవు పరిస్థితులను శాఖల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ కేంద్ర బృంద సభ్యులకు వివరించారు. జిల్లాలోని వలేటివారిపాలెం, కందుకూరు, లింగసముద్రం, సీతారామపురం, వరికుంటపాడు, కొండాపురం, కలిగిరి, దుత్తలూరు, మర్రిపాడు, కలువాయి మండలాలను జాతీయ విపత్తుల సంస్థ కరవు మండలాలుగా ప్రకటించిందన్నారు.
జిల్లాలోని 10 కరవు మండలాల్లో వ్యవసాయం, రూరల్ వాటర్ సప్లయ్, పశు సంవర్థకశాఖలకు సంబంధించి రైతులను ఆదుకునేందుకు రూ.1335.69 లక్షల మేర నిధులు అవసరమని కలెక్టర్ కేంద్ర బృందసభ్యులకు వివరించారు. జిల్లాలో వర్షాలు చెదురు ముదురుగానే కురుస్తున్నాయని, రానున్న రెండు నెలలు ఇదే పరిస్థితి ఉంటే మెట్ట ప్రాంతాల్లో తాగు, సాగు నీటికి ఇబ్బంది కలుగుతాయని, ట్యాంకర్ల ద్వారా తాగునీటిని చేయాల్సి వస్తుందని చెప్పారు. ఈ పరిస్థితులను దృష్టిలో జిల్లాకు నిధులు మంజూరు చేయించేందుకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కేంద్ర బృంద సభ్యులకు కలెక్టర్ కోరారు.