ఇంటర్నెట్ అవసరం లేకుండానే UPI చెల్లింపులు
అమరావతి: ఇంటర్నెట్ కనెక్షన్ లేని ప్రాంతాల్లోనూ సులభంగా యూపీఐ చెల్లింపులు జరిపేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక కొత్త ఫీచర్ను అభివృద్ధి చేస్తున్నది. ముఖ్యంగా విమానాలు, భూగర్భ మెట్రో స్టేషన్లు, మారుమూల గ్రామాలు వంటి నెట్వర్క్ సరిగాలేని లేదా అసలు లేని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఈ ఫీచర్ను రూపొందిస్తున్నారు. దీని ద్వారా యూజర్ ఫోన్, వ్యాపారి వద్ద ఉండే ‘పాయింట్ ఆఫ్ సేల్’ టెర్మినల్ రెండూ ఆఫ్లైన్లో ఉన్నప్పటికీ.. రూ.2,000 వరకు చెల్లింపులు చేయవచ్చు. ఈ సదుపాయాన్ని ‘ట్యాప్-టు-పే’ విధానంలో తీసుకురానున్నారు. వినియోగదారులు ముందుగా తమ ఫోన్లో ఇంటర్నెట్ ఉన్నప్పుడు ‘ఆన్-డివైస్ యూపీఐ లైట్ వ్యాలెట్’ లోకి నగదును లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటర్నెట్ సిగ్నల్ లేని ప్రదేశాల్లో వస్తువులు కొనుగోలు చేసినప్పుడు, తమ ఎన్ఎఫ్సీ ఆధారిత స్మార్ట్ఫోన్ను వ్యాపారి వద్ద ఉన్న సర్టిఫైడ్ ఆఫ్లైన్ పీఓఎస్ టెర్మినల్పై ట్యాప్ చేస్తే చాలు. ఎలాంటి యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే లావాదేవీ పూర్తవుతుంది.

