ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు-మంత్రి సత్యకుమార్
విశాఖ, ఒంగోలు, విజయవాడ, తిరుపతి, కర్నూలు…
అమరావతి: రాష్ట్రంలోని ఐదు బోధనాసుపత్రుల్లో తొలిసారిగా కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు రాబోతున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు, వీల్ ఛైర్లు, వినికిడి పరికరాలు, ఇతర సహాయ ఉపకరణాల తయారీ ఈ కేంద్రాల్లో జరుగుతాయని పేర్కొన్నారు. వైద్యులు సూచించే అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు ఇవ్వడంవల్ల దివ్యాంగులకు వ్యయప్రయాసలు తగ్గుతాయని సోమవారం ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ తయారీ యూనిట్లను రాష్ట్రంలో ఏర్పాటుచేసేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. తొలివిడత కింద ఒంగోలు, తిరుపతి, కర్నూలు, విజయవాడ, విశాఖ సర్వజన ఆసుపత్రుల్లో ఈ తయారీ యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన స్థలాలు, నిర్మాణాలు, ఇతర వసతుల పరిశీలన కేంద్ర బృందాల ద్వారా సోమవారం నుంచి ప్రారంభమైందని తెలిపారు. బోధనాస్పత్రుల్లోనే ‘సదరం’ కింద 21 రకాల దివ్యాంగ సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు.
కొలతలు,తయారుచేయడం, అమర్చడం,మరమ్మతులు:- కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత మంత్రిత్వ శాఖ ద్వారా దేశ వ్యాప్తంగా 102 తయారీ కేంద్రాలు నడుస్తున్నాయి. ‘ప్రధానమంత్రి దివ్యాంగ వయోశ్రీ’ పేరుతో ఇవి నడుస్తున్నాయి.వీటికి అదనంగా మరో 300 కేంద్రాలను 2030 నాటికి ఏర్పాటుచేయాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
అందుబాటులో ఉన్న తయారీ యూనిట్లలో:- మహిళా, శిశు అభివృద్ధి, దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు మధ్య జరిగిన చర్చల అనంతరం భారతీయ కృత్రిమ అవయవాల తయారీ సంస్థ (ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తరపున ప్రత్యేక బృందాలు సోమవారం నుంచి పరిశీలించడం ప్రారంభించాయి. వైద్యుల సూచనల మేరకు అందుబాటులో ఉన్న తయారీ యూనిట్లలో కృత్రిమ అవయవాలు తయారు చేయడం సులువుగా ఉంటుంది. దివ్యాంగుల నుంచి కొలతలు తీసుకోవడానికి, తయారుచేయడానికి, అమర్చడానికి, వాటి మరమ్మతులు చేయడానికి, ఇతర అవసరాలకు తగ్గట్లు నియామకాలు జరుగుతాయని, తయారీ పరికరాలు, మౌలిక సదుపాయాలు కల్పన కూడా యూనిట్లలో జరుగుతుందన్నారు.

