దృష్టి లోపాలున్న క్రోచెట్ లేస్ కళాకారులకు కళ్లజోళ్లు పంపించిన పవన్ కళ్యాణ్
అల్లికలతో అలసిన కళ్లకు కొత్త వెలుగులు..
మరిన్ని నేత్ర వైద్య శిబిరాల నిర్వహణకు సన్నాహాలు..
అమరావతి: క్రోచెట్ లేస్ కళాకారుల కష్టాలను తెలుసుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మసకబారిన వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు. వైద్య పరీక్షలు చేయించి వదిలేయకుండా, 141 మందికి కళ్లజోళ్లు సిద్ధం చేయించారు. గత నెల విజయవాడ వేదికగా ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ నిర్వహించిన హస్తకళా మహోత్సవ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్ కళాకారులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా పలువురు హస్తకళాకారులు తమ వృత్తిని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను ఉపముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. నరసాపురం నియోజకవర్గం పరిధిలోని పసలదీవికి చెందిన క్రోచెట్ లేస్ కళాకారిణి శ్రీమతి మహాలక్ష్మి తన ఆరోగ్య సమస్యను వివరించారు. చిన్న చిన్న నమూనాలను గంటల కొద్దీ చూస్తూ ఉండడం వల్ల చూపు మందగిస్తోందని, కంటి పరీక్షలు చేయించాలని కోరారు.
అదే వేదికపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్లవారీగా హస్తకళాకారుల కోసం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గత నెలలో నరసాపురంలో క్రోచెట్ లేస్ కళాకారుల కోసం నిర్వహించిన నేత్ర వైద్య శిబిరంలో 141 మందికి కళ్లజోళ్లు అవసరమని వైద్యులు సూచించారు. ఆ 141 మందికి పవన్ కళ్యాణ్ కళ్లజోళ్లు ఏర్పాటు చేశారు.
మరిన్ని నేత్ర వైద్య శిబిరాల నిర్వహణకు సన్నాహాలు:- పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు క్లస్టర్ల వారీగా హస్తకళాకారుల కోసం ఉచిత వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. క్రోచెట్ లేస్ కళాకారుల కోసం నిర్వహించిన మొదటి నేత్ర వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారికి కళ్లజోళ్లు సిద్ధం కాగా, పాలకొల్లు పరిధిలోని యలమంచిలి, అత్తిలిలో మరో రెండు శిబిరాలు పూర్తయ్యాయి. ఈ రెండు శిబిరాల్లో దృష్టి లోపాలు ఉన్నట్లు గుర్తించిన మరో 350 మందికి కూడా ఉపముఖ్యమంత్రి కళ్లజోళ్లు ఏర్పాటు చేయిస్తున్నారు. మరో 20 మందికి పైగా కంటిశుక్లం (చుక్కల వ్యాధి) సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వారికి శస్త్రచికిత్సలు చేయించనున్నారు. క్రోచెట్ లేస్ కళాకారుల కోసం ఆచంట, నరసాపురంలో మరో రెండు నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు.

