7 నుంచి 14 రోజుల పాటు యోగా కార్యక్రమాలు-మంత్రి సత్యకుమార్
ఏపీ యోగా ప్రచార పరిషత్ ఏర్పాటు..
అమరావతి: అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను రాష్ట్రంలో ‘యోగాంధ్ర-2026’ పేరుతో ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ‘యోగా ఫర్ హెల్తీ ఏజింగ్(Yoga for Healthy Aging) అనే విశిష్ట నినాదంతో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) వేడుకల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుపుతున్నామని తెలిపారు. యోగాను కేవలం ఒక రోజు కార్యక్రమంగా కాకుండా.. ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం చేయడమే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు జరుపుతున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది పౌరులను యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తామన్నారు.10 లక్షల మంది నిత్య సాధకులను తయారుచేస్తామని వెల్లడించారు. ఈసారి కూడా యోగా-ప్రకృతి వైద్య ప్రభుత్వ సలహాదారు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో రూపొందించిన యోగా వీడియోలను ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు.
జూన్ 21న ప్రధాన యోగా దినోత్సవ వేడుకలు రాజధానిలో:- రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 28 ప్రత్యేక్ష థీమ్లతో కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ప్రతి జిల్లాలో రెండు ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో (మొత్తం 56 ప్రాంతాలు) యోగా ప్రదర్శనలు నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 4 పర్యాటక ప్రదేశాల్లో ప్రతిచోటా కనీసం 500 మందితో ఈ కార్యక్రమాలు వేడుకగా జరుగుతాయి.ఈనెల 7న యోగా కార్యక్రమాలు ప్రారంభ కార్యక్రమాన్ని శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించామని మంత్రి శ్ సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు.

