ద్రోణి ప్రభావంతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం
అమరావతి: నైరుతి-ఆనుకొని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం కేంద్రం నుండి, ఉత్తర తమిళనాడు, రాయలసీమ,కర్ణాటక మీదుగా మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో శుక్రవారం అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
శుక్రవారం(15-05-26) రాష్ట్రంలో 43-44°C మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందని తెలిపారు. అల్లూరి జిల్లా జికే వీధి మండలం, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, గుర్తేడు మండలాల్లో(4) వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నదని అలాగే ఈనెల 22 వరకు భానుడు తన ప్రతాపాన్ని చూపుతాడని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

