శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపులో మార్పులు-టీటీడీ
తిరుమల: భక్తుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించిన దర్శన టికెట్ల కేటాయింపులో పలు మార్పులు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజుకు 1500 శ్రీవాణి టికెట్లను టీటీడీ ఆన్ లైన్ ద్వారా అందుబాటులో ఉంచడం జరిగింది. వీటిలో 500 దర్శన టికెట్లను మూడు నెలల ముందుగా ఆన్ లైన్ లో అడ్వాన్స్ బుకింగ్ కింద అందుబాటులో ఉంచడం జరిగింది. మరో 200 శ్రీవాణి దర్శన టికెట్లను తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద జారీ చేయడం జరుగుతోంది. ప్రస్తుతం రోజువారీ కరెంట్ బుకింగ్ కోటాలో అందుబాటులో ఉన్న 800 శ్రీవాణి దర్శన టికెట్లలో ఇప్పటికే రూ.10 వేలు విరాళం చెల్లించి దర్శన టికెట్ కోసం వేచి ఉన్న దాతలకు ప్రతిరోజూ 300 టికెట్లు ప్రత్యేకంగా కేటాయించాలని నిర్ణయించడం జరిగింది. ఈ సదుపాయం 2025 మే 1 నుండి విరాళం చెల్లించిన అర్హులైన దాతలకు వర్తించనుంది. ఈ టికెట్లు ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు విడుదల చేయబడతాయి. మధ్యాహ్నం 1 గంటలోపు బుక్ చేసుకున్న భక్తులకు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనం కల్పించబడుతుంది. ఈ విధానం జూన్ 10వ తేది నుండి అమలులోకి రానుంది. ఈ కోటాలో బుకింగ్ కాని టికెట్లను తిరిగి కరెంట్ బుకింగ్ కోటాలో కలపబడతాయి. ఈ విధానం 2027 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది.

