కార్గిల్ లో ప్రతి సైనికుడు చేసిన త్యాగాన్ని భారత జాతి ఎప్పటికీ మరువదు-ఉపముఖ్యమత్రి
అమరావతి: కార్గిల్ వద్ద ఆక్రమణకు గురైన భారత భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న సమయంలో జరిగిన యుద్ధంలో 527 మంది సైనికులు వీరమరణం పొందారని ఉపముఖ్యమత్రి పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు.నేడు (జూలై-26వ తేది) కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు అసాధారణ సాహసం, అపార త్యాగంతో శత్రువులను తిప్పికొట్టి దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించారన్నారు. అమరవీరుల వీరత్వం, దేశభక్తి, త్యాగనిరతి భావితరాలకు శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తాయని,దేశ రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన ప్రతి సైనికుడి త్యాగాన్ని భారత జాతి ఎప్పటికీ మరువదన్నారు. వారి కుటుంబాలకు దేశం ఎల్లప్పుడూ అండగా ఉంటుందనే భావనతో కార్గిల్ అమరవీరులకు మరోసారి వినమ్ర నివాళులు అర్పిస్తున్నట్లు అయన పేర్కొన్నారు.

