రికార్డు ధరకు అమ్ముడైన పులస చేప
అమరావతి: పుస్తేలు అమ్ముకుని అయిన పులస చేప తినాలనే నానుడి ఉభయ గోదావరి జిల్లాల్లో విన్పిస్తుంది.అలాంటి పులస చేపల సీజన్ మొదలైంది. యానాం రేవులో జరిగిన వేలంపాటలో ఈ రెండు చేపలను కలిపి ఓ మహిళ ఏకంగా రూ.31,500 కు కొనుగోలు చేశారు. మత్స్యకారులకు రెండు పులస చేపలు చిక్కాయి. 1.300 కేజీల బరువున్న ఒక దానికి నిర్వహించిన వేలంలో మత్స్యకార మహిళ పార్వతి పాల్గొన్నారు. ఒక చేపను రూ. 24,000 కు, మరో చేపను రూ.7,500 కు మొత్తం రూ.31,500కు ఆమె దక్కించుకున్నారు.
గోదావరి ప్రవాహానికి ఎదురు ఈదుతుంది:- ఈ ఏడాది ప్రారంభంలో మగ పులసకు ఇంత భారీ ధర పలకడం ఇదే తొలిసారని స్థానిక మత్స్యకారులు అన్నారు. నెల రోజుల క్రితం దొరికిన 1.250 కేజీల పులస రూ.14,000 పలికింది. ఈ సంవత్సరం వాతావరణ మార్పుల కారణంగా పులసల లభ్యత గణనీయంగా తగ్గింది. ప్రతి సంవత్సరం జూలై, ఆగస్టు నెలల్లో గోదావరికి ఎర్ర నీరు వచ్చినప్పుడు పులసల రాక మొదలవుతుంది. సముద్రంలో ఉండే ఇలస చేప, గుడ్లు పెట్టేందుకు గోదావరి ప్రవాహానికి ఎదురీదుతుంది. ఈ క్రమంలోనే అది పులసగా మారుతుంది. దీని రుచి అద్భుతంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు పులస కోసం గోదావరి జిల్లాలకు వస్తుంటారు. అరుదుగా దొరకడం, అమోఘమైన రుచి కారణంగానే దీనికి ఇంతటి డిమాండ్ ఏర్పడింది.

