బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో పాస్టర్కు 20 ఏళ్ల జైలు శిక్ష
అమరావతి: సండే క్లాస్ల నిమిత్తం చర్చికి వచ్చే బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో పాస్టర్కు విజయవాడ ప్రత్యేక పోక్సో కోర్టు కఠినమైన శిక్షను విధించింది. దోషిగా తేలిన పాస్టర్కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.30,000 జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.జయలక్ష్మి తీర్పు వెలువరించారు.
ముగ్గురు బాలికలపై లైగింక వేధింపులు:- విజయవాడలోని మాచవరం పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న ఓ చర్చిలో ప్రతి ఆదివారం జరిగే ‘సండే స్కూల్’కు వచ్చే ముగ్గురు బాలికలతో అక్కడి పాస్టర్ అసభ్యంగా ప్రవర్తించేవాడు. వారిపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా, ఈ విషయాలు బయటకు చెబితే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని మైనర్ బాలికలను భయభ్రాంతులకు గురిచేసేవాడని సమాచారం.
2020లో కేసు నమోదు:- పాస్టర్ వేధింపులు భరించలేని బాధిత బాలికలు ధైర్యంచేసి కుటుంబ సభ్యులకు తెలపడంతో 2020లో వారు మాచవరం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి, నిందితుడిపై నేరం ఆధారాలతో సహా రుజువైందని స్పష్టం చేశారు. బాధితులైన ముగ్గురు చిన్నారులకు ఒక్కొక్కరికి రూ.1,00,000 చొప్పున పరిహారం అందజేయాలని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది.

