చెత్త కుప్పలో మంటలు ఎందుకు వస్తాయో తెలుసుకుని మాట్లాడాలి-మంత్రి నారాయణ
ల్లూరు: వైసీపీ నేతలు చేస్తున్నవి చెత్త ఆరోపణలని మంత్రి నారాయణ మండిపడ్డారు. చెత్తను కాలుస్తున్నారంటూ అవివేకంగా మాట్లాడుతున్నారని, డంపింగ్ యార్డుల్లో చెత్త కుళ్లే సమయంలో బయోగ్యాస్, అందులోని మిథేన్ కారణంగా మంటలు చెలరేగుతాయని తెలిపారు. మంటలు ఎందుకు వస్తాయో తెలుసుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు.నెల్లూరు సిటీ లో పర్యటించిన మంత్రి మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే వైఎస్ఆర్సీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. తనపై అవినీతి ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు.డబ్బే కావాలనుకుంటే నారాయణ విద్యాసంస్థలను చూసుకుంటే చాలన్నారు.2019లో రూ.2,500 కోట్లుగా ఉన్న టర్నోవర్ను 2024 నాటికి రూ.6,500 కోట్లకు పెంచి తన పిల్లలకు అప్పగించానని చెప్పారు.
పేదరికం నుంచి వచ్చిన తనకు పేదల కష్టాలు తెలుసని, ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. పేద పిల్లలకు విద్యను ఆస్తిగా అందించాలనే లక్ష్యంతో నెల్లూరు ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నానన్నారు. భగత్సింగ్ కాలనీ, సర్వేపల్లి కాలువకట్ట వాసులకు శాశ్వత పట్టాలు వచ్చేలా చేసినా ఓర్వలేకున్నారని మండిపడ్డారు. ప్రజలకు అన్నీ తెలుసని, ఎవరు ఏం చేస్తున్నారో గమనిస్తున్నారన్నారు.ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే ప్రజల ఛీత్కారానికి గురికాక తప్పదని హెచ్చరించారు

