డేటా సెంటర్లపై అపోహలు వద్దు-మంత్రి నారా లోకేష్
విశాఖపట్నం..ఇక ఏఐ పట్నం..
6.5 గిగావాట్ల డాటా సెంటర్ల లక్ష్యం పూర్తి..
కొంతమంది కావాలని దొంగ వీడియోలు..
థర్మల్ ప్లాంటులపై మాట్లాడరెందుకు..
గోదావరి నీరు ఏటా 3వేల టీఎంసీలు వృధా..
విశాఖకు ఐటీ సంస్థలు క్యూ-రాష్ట్రవ్యాప్తంగా అనుబంధ సంస్థలు..
అమరావతి: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 6.5 గిగావాట్లకు మించకుండా లక్ష్యాన్ని పూర్తి చేశామని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అసెంబ్లీలో డేటా సెంటర్లపై వస్తున్న అపోహలపై నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ… కొంతమంది కావాలని డేటా సెంటర్లపై అపోహలు సృష్టిస్తున్నారు. గూగుల్ అనే సంస్థ విశాఖ వస్తున్నామని ప్రకటించాకే ఐటి సంస్థలు విశాఖవైపు చూస్తున్నాయి. మనమంతా వాడే స్మార్ట్ ఫోన్ అందులో వినియోగించే ఎఐ డేటా సెంటర్లతో ముడిపడి ఉంది.
గోదావరి నీరు ఏటా 3వేల టీఎంసీలు వృధా:- గోదావరి నుంచి ఐదేళ్ల సరాసరి తీసుకుంటే సాధారణంగా ప్రతిఏటా 3వేల టిఎంసిల నీరు బంగాళాఖాతంలో వృధాగా పోతోంది. మనం ఆ నీటిలో కొంతభాగాన్ని పోలవరంలోకి మళ్లించి గ్రావిటీ ద్వారా విశాఖకు తీసుకువస్తున్నాం. ప్రస్తుత సాంకేతికత ప్రకారం 6.5 గిగావాట్ల డేటా సెంటర్లు విశాఖలో ఇన్ స్టాల్ అయితే 3 టిఎంసిల నీరు అవసరమవుతుంది.
థర్మల్ ప్లాంటులపై మాట్లాడరెందుకు?:- 1 గిగావాట్ ధర్మల్ పవర్ ప్రాజెక్టు డేటా సెంటర్ ఉపయోగించే నీటి కంటే పదిరెట్లు ఎక్కువగా వినియోగిస్తుంది. విశాఖలో ఇప్పుడు డేటా సెంటర్లపై ధర్నా చేస్తున్న వారు ఏనాడు ధర్మల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు. ఎనర్జీ కావాలి, డేటా సెంటర్ వద్దనడం ఎలా సబబు? ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఎఐ అనివార్యం. అది మన జీవితం భాగమైంది. గూగుల్ పెద్దఎత్తున పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం వల్లే మిగిలిన గ్లోబల్ సంస్థలు విశాఖలో తమ డేటా సెంటర్లకు భూములు కేటాయించాలని అడుగుతున్నాయి.
ఎకో సిస్టమ్ వస్తుంది:- డేటా సెంటర్ల వల్ల ఉద్యోగాలు వస్తాయా అనే చర్చ జరుగుతోంది. డేటా సెంటర్ చుట్టూ ఎకో సిస్టమ్ చాలా ముఖ్యం. ఎఐ డేటా సెంటర్స్ వస్తున్నాయి. అడ్వాన్స్ డ్స్ చిప్స్ రావాలి. ఆ చిప్స్ ను ఈరోజు గూగుల్ తీసుకువస్తుంది. దానివల్ల ఎఐకి సంబంధించిన కటింగ్ ఎడ్జ్, ఇతర కంపెనీలు విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుంటాయి. భారీ ఎత్తున వస్తున్న డేటా సెంటర్ ఎకోసిస్టమ్ కు ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అవసరం. ప్రతి ఐదేళ్లకు దానిని అప్ గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల ఈరోజు కెరీర్, ఎల్జీ ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా అనుబంధ సంస్థలు:- పవర్ జనరేషన్, ట్రాన్స్ మిషన్ లైన్లు, 6.5 గిగావాట్ల డేటా సెంటర్లకు సరిపడా వరల్డ్ క్లాస్ డేటా సెంటర్లు తీసుకురావాల్సిన బాధ్యత మనపై ఉంది. అందులో భాగంగా మరికొన్ని కంపెనీలు విశాఖలో భూములు అడుగుతున్నారు. వరల్డ్ క్లాస్ ట్రాన్స్ ఫార్మర్ల తయారీ, డెలివరీ కోసం ఇన్ ఫ్రా కావాలని కోరుతున్నారు. అది కూడా విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తాం.పవర్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు కూడా ఈరోజు రాయలసీమకు వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయి. అక్కడ ఎలక్ట్రానిక్స్ ఎకోసిస్టమ్ ఉన్నందునే అక్కడే పవర్ ఎలక్ట్రానిక్స్ వస్తున్నాయి.

