ఇంద్రకీలాద్రిపై ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ ప్రత్యేక పూజలు
అమరావతి: ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్ (Art of Living) వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ బుధవారం నాడు ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని సందర్శించారు. ఆయనతో పాటు మాజీ పార్లమెంట్ సభ్యులు (Ex-MP) గోకరాజు గంగరాజు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన రవిశంకర్ గురూజీకి దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), దేవస్థాన కార్యనిర్వహణాధికారి (EO) వీ.కే. సీనా నాయక్-పాలకమండలి (ట్రస్ట్ బోర్డ్) సభ్యులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. గురూజీ-ప్రముఖుల పర్యటన నిమిత్తం ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.
అనంతరం వారు అంతరాలయంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ వేద పండితులు వారికి వేదాశీర్వచనం పలికారు.అనంతరం,అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు-అమ్మవారి చిత్రపటమును గురూజీకి బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

