అరణ్యారామం భవన ప్రాంగణానికి భూమి పూజ చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అటవీ శాఖ పరిశోధన,శిక్షణ..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల పరిశోధన, శిక్షణ కార్యక్రమాల పర్యవేక్షణ భవనం అరణ్యారామానికి ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన, భూమి పూజ చేశారు. మంగళగిరిలోని ఎయిమ్స్ సమీపంలో, బ్రహ్మానందపురం వద్ద సూమారు రూ.24 కోట్ల అంచనా వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు.
H.A.N.U.M.A.N:- ఈ అరణ్యారామం అటవీ, పర్యావరణ శాఖలకు సంబంధించి పరిశోధనలు, శిక్షణా కార్యక్రలాపాలతోపాటు ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నింటినీ ఒకే వేదిక నుంచి సమన్వయం చేసే కామన్ ఫెసిలిటీ సెంటర్ గా సేవలు అందించనుంది. రాష్ట్ర అటవీ పరిశోధన, శిక్షణ కార్యక్రమాలకు అరణ్యారామం వేదిక కానుంది. H.A.N.U.M.A.N. కార్యకలాపాలకు కమాండ్ సెంటర్గా, ఆంధ్రప్రదేశ్ గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమానికి పర్యవేక్షణ కేంద్రంగా, పులుల సంరక్షణ, అటవీ అగ్నిప్రమాదాల నివారణ, జీవావరణ పునరుద్ధరణ, వాతావరణ స్థిరత్వం, ఎకో-టూరిజం అభివృద్ధి, డిజిటల్ పర్యావరణ పరిపాలన తదితర విభాగాలకు సమన్వయ కేంద్రంగా సేవలు అందించనుంది. అధునాతన సాంకేతికత సాయంతో ప్రకృతి పరిరక్షణ ధ్యేయంగా అరణ్యారామంలో శాస్త్రీయ పరిశోధనలు జరపనున్నారు. క్షేత్ర స్థాయిలో అమలు చేసే కార్యకలాపాలన్నింటినీ ఒకే చోటు నుంచి పర్యవేక్షించే పరిపాలనా కేంద్రంగా నిలవనుంది.

