ఏపీ వైద్య మండలికి ఎన్నికైన 13 మంది సభ్యులు-రిటర్నింగ్ అధికారి, చక్రధరబాబు
20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత..
అమరావతి: ఏపీ వైద్య మండలి(ఏపీ మెడికల్ కౌన్సిల్) కి ఎన్నికైన 13 మంది సభ్యుల ఆన్లైన్ ఫలితాల్ని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ సమక్షంలో రిటర్నింగ్ అధికారి, డైరెక్టర్ సెకండరీ హెల్త్ చక్రధరబాబు మంగళవారం నాడు తాడేపల్లిలోని తన కార్యాలయంలో విడుదల చేశారు. విజయం సాధించిన వారికి ఆయన సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా చక్రధరబాబు మాట్లాడుతూ మొత్తం 56,156కు గాను 30,773 మంది (55%) వైద్యులు”ఈ ఓటింగ్” ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడం శుభ పరిణామన్నారు. ఎపిఎంసిలో 13 సభ్యుల స్థానాలకు 84 మంది వైద్యులు పోటీపడ్డారన్నారు. 20 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఈ ఎన్నికలు జరిగాయన్నారు.
ఒక్కొక్కరు 13 ఓట్లు వేసేందుకు అవకాశం ఉండగా, మొత్తంగా 3,15,745 ఓట్లు పోలయ్యాయని. క్యుములేటివ్గా ఎవరికైతే అధిక శాతం ఓట్లు వచ్చాయో వారు సభ్యులుగా ఎన్నికయ్యారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పారదర్శకంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహించామన్నారు. అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ఎన్నికల ప్రక్రియను సమర్ధవంతగా నిర్వహించామని, ఓటర్లకు హెల్ప్ లైన్ ద్వారా రియల్ టైం విధానంలో సహాయ సహకారాల్ని అందించామన్నారు. అలాగే ఎపిఎంసి చునావ్ బాట్ అనే చాట్ బాట్ ను చాలా మంది వైద్యులు వినియోగించుకోవడం అభినందనీయమన్నారు. మొత్తమ్మీద ఓటర్లుగా నమోదు, ఈ-ఓటింగ్ విధానం పట్ల వైద్యుల్లో మంచి స్పందన వచ్చిందన్నారు. వారి వారి ఉద్యోగాలు చేసుకుంటూ ఎంతో బిజీ షెడ్యూల్స్ లో చాలా మంది దేశ విదేశాల్లో ఉన్నా కూడా ఎపిఎంసిలో ఓటు వేసేందుకు పేర్లను నమోదు చేసుకున్నారన్నారు. ఎన్నికల నిర్వహణకు సహకరించి సమర్ధవంతంగా పనిచేసినందుకు ఎపిఎంసి రిజిస్ట్రార్ డాక్టర్ రమేష్ ను, రాత్రి పగలు పనిచేసిన ఎన్ఐసి, ఏపీఆన్లైన్ సిబ్బందిని ఆయన అభినందించారు. ఎన్నికైన అభ్యర్థులు 13 మంది ఈ కౌన్సిల్ లో ఉంటారని, మరి కొంతమందిని నామినేటెడ్ సభ్యుల్ని కూడా ప్రభుత్వం తరపున నియామకం జరుగుందని, మొత్తం 25 మంది సభ్యులతో ఎపిఎంసి సేవలందిస్తుందని చక్రధరబాబు తెలిపారు.
ఎంబిబిఎస్ చదివిన వారు, పీజీ డిప్లమా చేసిన వారు, స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు కూడా ఎన్నికల్లో పాల్గొన్నారన్నారు. ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులకు చెందిన డాక్టర్లు ఎన్నికల్లో పాల్గొన్నారన్నారు. ఎన్నికైన సభ్యులు వారి వారి వృత్తిపరమైన అనుభవాన్ని మండలి దృష్టికి తీసుకొచ్చి రానున్న రోజుల్లో ఎపిఎంసికి వన్నెతెస్తారనే నమ్మకం తనకుందని చక్రధరబాబు తెలిపారు. హైకోర్టు వారి ఆదేశాల మేరకు అత్యంత తక్కువ సమయంలో జవాబుదారితనంగా, పారదర్శకంగా ఎన్నికల్ని నిర్వహించామన్నారు.
ఎన్నికైన 13 మంది సభ్యులు:- 10,293 కోట్లతో కోల అలేఖ్య ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా బొల్ల మౌనిక 10,189 ఓట్లతో ద్వితీయ స్థానంలో, మనీష్ మండల 10,123 ఓట్లతో తృతీయ స్థానంలో నిలిచారు. మంతిని వినోద్ కుమార్ కు 9,857 ఓట్లు, అరవ వెంకట సుబ్బారెడ్డికి 9,174 , ఓ. శివమౌర్య గుప్తకు 8,884, ఇసుకపల్లి వాణికి 8,819, ఎం. వెంకటరమణకు 8,632, మెట్ల జయచంద్రారెడ్డికి 8,494, బొలెం తేజీ నవీన్ కు 7,820, గార్లపాటి నంద కిషోర్ కు 7,705 శ్రీహరి కరువకు 7,553, కార్తీక్ తుమ్మలకు 7,154 ఓట్లు లభించాయి

