మంగళవారం నుంచి ట్రాఫిక్ సిగ్నల్స్ అమలు-చలనాలు ఆటోమేటిగ్గా నమోదు-కమీషనర్
నెల్లూరు: నగరంలో ప్రధానంగా కొన్ని సాంకేతిక కారణాలు, రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను అమలు చేయలేకపోయామని నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ కార్యాలయంలో సోమవారం ఇంజనీరింగ్, ట్రాఫిక్ విభాగం అధికారులు, ఎస్.పి.టి.నెట్ వర్క్స్, మాట్రిక్స్ కంపెనీ ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నెల్లూరు నగరం పరిధిలోని 7 ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. అన్ని అడ్డంకులను అధిగమించి మంగళవారం నుంచి ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని కమిషనర్ వెల్లడించారు. అందులో భాగంగా ప్రయోగాత్మకంగా రేపు 6 కూడళ్ళలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను చివరి దశలో పరిశీలించి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రామలింగాపురం కూడలి ప్రాంతంలో ఎల్ & టి సంస్థ పనులు జరుగుతున్న కారణంగా అక్కడ ట్రాఫిక్ వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వాహన చోదకులు ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థకు అనుగుణంగా ప్రవర్తించాలని, లేనిపక్షంలో ఈ చలనాలు ఆటోమేటిగ్గా నమోదవుతాయని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక ఇంజనీరింగ్ విభాగం యస్.ఈ. రహంతు జానీ, సిటీ ప్లానర్ రఘునాధరావు, ట్రాఫిక్ సి.ఐ లు రామకృష్ణ, వెంకట్ రెడ్డి, ఎలక్ట్రికల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ముజాహిద్దీన్, యస్.పి.నెట్ వర్క్ , మాట్రిక్స్ కంపెనీ ప్రతినిధులు యుగంధర్, రాయుడు పాల్గొన్నారు.

