ఏఎస్ఆర్ జిల్లాలో భారీ వర్షాలు, వరదలపై ప్రజల్ని అప్రమత్తం చేయండి-పవన్ కళ్యాణ్
వాగులు పొంగుతున్న వేళ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు..
అవసరం ఉన్న చోట తక్షణం పునరావాస శిబిరాలు..
(పిడుగులతో కూడిన వర్షాల హెచ్చరిక -అప్రమత్తంగా ఉండండి–దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్.)
అమరావతి: అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న క్రమంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి,పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.
15 గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్:- భారీ వర్షాల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై జిల్లా కలెక్టర్తోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్షించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని, కొన్ని గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు వివరించారు. అధికారులు అందించిన సమాచారం ప్రకారం, జీకే వీధి మండలం గంగవరం సమీపంలో ఆంధ్రప్రదేశ్–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో సుమారు 15 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా, ఆ ప్రాంతంలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు.
ప్రజలు కూడా అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి భారీ వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల అధికారులను కూడా అప్రమత్తం చేశారు.

