డాలర్కు బదులుగా సొంత కరెన్సీలతో వాణిజ్యం-బ్రిక్స్-2026 డిక్లరేషన్
ఏకపక్షంగా విధిస్తున్న సుంకాలు, బలవంతపు చర్యలు..
ఆర్థిక, సామాజిక వృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకం..
అమరావతి: బ్రిక్స్ సభ్యదేశాల ఆమోదంతో దిల్లీ బ్రిక్స్-2026 డిక్లరేషన్ను శనివారం ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. భారత్ దౌత్యం ఫలితంగా ఫలితంగా విభేదాలు పక్కనపెట్టి దిల్లీ డిక్లరేషన్కు అరబ్ దేశాలైన ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా ఆమోదం తెలిపడం విశేషం. ఈ ప్రకటనకు ముందు జరిగిన చర్చలు చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా జరిగాయి. సదస్సు ప్రారంభంలో ఇరాన్, యూఏఈలు కఠిన వైఖరి అవలంభించాయి.
తెరవెనుక అద్భుతమైన దౌత్యం:- ఇలాంటి సమయంలో భారత్ అద్భుతమైన దౌత్యపరమైన చర్చలతో విజయం సాధించింది. శనివారం జరిగిన బ్రిక్స్ కూటమి సమావేశంలో సభ్యదేశాలన్నీ ఏకాభిప్రాయంతో ఒక జాయింట్ డిక్లరేషన్ను ఆమోదించాయి. పశ్చిమాసియా సంక్షోభం విషయంలో ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నప్పటికీ, తెరవెనుక జరిగిన వరుస చర్చల ఫలితంగా ఈ ప్రతిష్టంభనకు తెరపడింది. దీనితో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ జాయింట్ డిక్లరేషన్ ఆమోదం పొందినట్లు తాజాగా అధికారికంగా ప్రకటించారు.
డాలర్కు బదులుగా సొంత కరెన్సీలతో వాణిజ్యం:- బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం, డాలర్కు బదులుగా స్థానిక కరెన్సీలలోనే ఎక్కువగా జరగాలని, సరిహద్దు చెల్లింపుల కోసం ఆచరణాత్మక పరిష్కారాలను సులభతరం చేయాలని డిక్లరేషన్ పేర్కొంది. ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా విధిస్తున్న సుంకాలు, బలవంతపు చర్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ ప్రదర్శించాలని పిలుపునిచ్చింది. పహల్గాం ఉగ్రదాడిని బ్రిక్స్ డిక్లరేషన్ తీవ్రంగా ఖండించింది. సరిహద్దు ఉగ్రవాదం, ఉగ్ర నిధులు అరికట్టాలని, ఉగ్రవాద నిర్మూలనలో ద్వంద్వ వైఖరి వీడాలని స్పష్టం చేసింది. అలాగే అణు కేంద్రాలపై జరుగుతున్న దాడులను, పెరుగుతున్న అణ్వస్త్ర ప్రమాదాలను ఖండించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందాల్సిన నిధులను పక్కదారి పట్టిస్తూ, గ్లోబల్ మిలిటరీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం పట్ల విచారం వ్యక్తం చేసింది. అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాలకు శిలాజ ఇంధనాలు ఇంకా అవసరమేనని స్పష్టం చేస్తూనే, పర్యావరణ అనుకూల ఇంధనాల వైపు మారాలని డిక్లరేషన్ సూచించింది. ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటుకు బ్రిక్స్ దేశాలు తీర్మానించాయి. ఆర్థిక, సామాజిక వృద్ధిలో నిర్ణయాధికారులుగా మహిళల పాత్ర అత్యంత కీలకమని న్యూదిల్లీ డిక్లరేషన్ గుర్తించింది.

