చెట్టికులంగర భగవతి అమ్మవారి పుష్పాంజలి సేవలో-పవన్ కళ్యాణ్
ఆలయంలో పుష్పాంజలి సేవ.. అమ్మవారికి ప్రత్యేక పూజలు..
దసరా శరన్నవరాత్రులకు వచ్చే వేలాది మంది భక్తుల అన్నదానానికి విరాళం..
ఆలయానికి 1200 ఏళ్లకు పైగా చరిత్ర..
శివుడి మూడో కన్ను నుంచి అమ్మవారు జన్మించినట్టు..
అమరావతి: కేరళం రాష్ట్రంలోని అలప్పుజ జిల్లా పరిధిలో చారిత్రక ఆలయంగా పేరున్న చెట్టికులంగర శ్రీ భగవతి అమ్మవారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం పుష్పాంజలి సేవలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరోగ్య ప్రదాయినిగా పేరున్న శ్రీ భగవతి అమ్మవారికి పుష్పాంజలి సమర్పణ సర్వదోష నివారణ నిమిత్తంచేస్తారని ప్రతీతి. దసరా శరన్నవరాత్రుల తొమ్మిది రోజులు శ్రీ భగవతి అమ్మవారి దర్శనానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు అన్నదానానికి అయ్యే వ్యయం మొత్తాన్ని దేవస్థానం బోర్డుకు విరాళంగా పవన్ కళ్యాణ్ అందజేశారు. త్రిశక్తి స్వరూపిణి అయిన అమ్మవారి దర్శనానికి దసరా నవరాత్రుల రోజుల్లో వేలాదిగా భక్తులు తరలివస్తారు.

శివుడి మూడో కన్ను నుంచి అమ్మవారు జన్మించినట్టు:- అంతకు ముందు అమ్మవారి దర్శనానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ కి అధికారులు, అర్చకస్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి ముందుగా బాలశివుని దర్శించుకుని అర్చనలు చేశారు. అమ్మవారి దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న వినాయకుడు, నాగదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మేల్ శాంతి ఉప ముఖ్యమంత్రివర్యులతో పూజలు చేయించారు. చెట్టికులంగర భగవతి అమ్మవారి ఆలయానికి 1200 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. రాక్షస సంహారం కోసం శివుడి మూడో కన్ను నుంచి అమ్మవారు జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ భగవతీ అమ్మవారు త్రిశక్తి స్వరూపిణిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు.

