చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం-విపత్తుల నిర్వహణ సంస్థ
రాష్ట్రంలో ఒక వైపు మండే ఎండలు మరో వైపు వర్షం..
అనకాపల్లి, విజయనగరంలో వర్షం..
అమరావతి: వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో బుధవారం నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం విజయనగరం,మన్యం, అల్లూరి,పోలవరం, విశాఖ,అనకాపల్లి, కాకినాడ,శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.అలాగే మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
సోమవారం సాయంత్రం 5గంటల నాటికి అనకాపల్లి జిల్లా పరవాడలో 37.5మిమీ, విజయనగరం జిల్లా వేపాడలో 32.9మిమీ, అనకాపల్లి జిల్లా సాలపువానిపాలెంలో 32మిమీ, కొప్పాకలో 27.7మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.

