రాబోయే వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం-ఐఎండీ
అమరావతి: జూన్లో మొదటి వారంలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు కొద్దిరోజులు నెమ్మదించాయి.ప్రస్తుతం రుతుపవనాలు మళ్లీ వేగం పుంజుకుని ఉత్తర భారత దిశగా కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) తాజాగా వెల్లడించింది. దీంతో రాబోయే వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
వాతావరణ శాఖ అంచనా ప్రకారం, రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని మిగిలిన ప్రాంతాలు, ఝార్ఖండ్, బిహార్, ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించే అవకాశముంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40- 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

