AP&TGBUSINESSOTHERS

కోకాపేటలో ట్రంప్‌ టవర్స్‌-65 అంతస్తులు, పెంట్‌ హౌస్‌ ధర రూ.62 కోట్లు

హైదరాబాద్: హైదరాబాద్​లో మరో అతిపెద్ద రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభం కాబోతోంది. కోకాపేటలోని గోల్డెన్‌ మైల్‌ రోడ్డులో ట్రంప్‌ టవర్స్‌ ఏర్పాటు కానున్నాయి. ట్రంప్‌ ఆర్గనైజేషన్‌, ట్రిబెకా డెవలపర్స్‌, ఐరా రియాల్టీ సంస్థలు సంయుక్తంగా వీటి నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నాయి. మొత్తం 65 అంతస్తులతో రెండు టవర్ల నిర్మాణం జరగనుంది. అతి ఖరీదైన 450 ఫ్లాట్లు ఉండనున్నాయి. ట్రంప్‌ టవర్స్‌కు ఇప్పటికే రెరా అనుమతులు ఇచ్చింది.

తొలిసారిగా ట్రంప్‌ టవర్స్‌:- ఈ టవర్ల ఎత్తు 240 మీటర్లు ఉంటుంది. ఇవి దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తయిన టవర్లుగానూ, భారతదేశంలోనే అత్యంత ఎత్తయిన ట్రంప్ టవర్లుగానూ నిలవనున్నాయి. దీనికి సంబంధించి త్వరలో జరిగే భూమి పూజకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. మూడేళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ట్రిబెకా డెవలపర్స్, ఐరా రియాల్టీ సంస్థలు వెల్లడించాయి. ముంబయికి చెందిన ట్రిబెకా డెవలపర్‌ ట్రంప్‌ బ్రాండ్‌తో నిర్మాణాలు చేపడుతోంది. ట్రంప్‌ టవర్స్‌ పేరుతో దేశంలో ఇప్పటికే 8 ప్రాజెక్టులు ప్రకటించింది. పుణె, ముంబయి, కోల్‌కతా, గురుగ్రామ్‌లో నాలుగు ప్రాజెక్టులను పూర్తి చేసింది. దక్షిణ భారతంలో తొలిసారిగా హైదరాబాద్‌లో ట్రంప్‌ టవర్స్‌ను నిర్మించబోతోంది.

ఒక పెంట్ హౌస్ రూ.62 కోట్లు:- హైదరాబాద్‌లో ఒక ప్రాజెక్ట్‌ చేపట్టాలని తాము ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, అది ఇప్పటికి సాకారమవుతోందని ట్రిబెకా డెవలపర్‌ వ్యవస్థాపకుడు కల్పేశ్‌ మెహతా పేర్కొన్నారు. భూమి ధర మినహాయిస్తే ఈ ప్రాజెక్ట్‌కు రూ.1700 -1800 కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నారు. విక్రయం ద్వారా రూ.3500 కోట్ల నుంచి రూ.4200 కోట్ల మేర ఆదాయం సమకూరొచ్చని పేర్కొన్నారు. ఇందులో పెంట్ హౌస్​ను గరిష్ఠంగా రూ.62 కోట్లకు విక్రయించినట్లు వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *