మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన ప్రక్రియకు షెడ్యూల్
అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమైంది. వార్డులను జనాభా పరంగా పునర్విభజన చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ చర్యలపై హైకోర్టులో దాఖలైన వాజ్యాలను కొట్టేయడంతో ప్రభుత్వం చకచక ఫైల్స్ ను కదుపుతొంది. రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు పురపాలక శాఖ డైరెక్టరేట్ షెడ్యూల్ ప్రకటించింది.2011 జనాభా లెక్కల ఆధారంగా జరిగే ఈ పునర్విభజనపై ఈనెల 14న గెజిట్ నోటిఫికేషన్ వెలవరించనున్నారు.
పట్టణ స్థానిక సంస్థల్లో వార్డుల హద్దులను పునర్వ్యవస్థీకరించే ప్రక్రియను పూర్తి చేసేందుకు మున్సిపల్ శాఖ టైమ్లైన్ రూపొందించింది. మొత్తం 39 పట్టణ స్థానిక సంస్థల్లో దశలవారీగా డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. మొదటి దశలో 26 పట్టణ స్థానిక సంస్థల్లో డీలిమిటేషన్ ప్రక్రియకు సెప్టెంబర్ 3ను గడువుగా నిర్ణయించారు. పార్వతీపురం, సాలూరు, నర్సీపట్నం, విజయవాడ, రామచంద్రాపురం, జగ్గయ్యపేట, మాచర్ల, వినుకొండ, సత్తెనపల్లి, మార్కాపురం, చీరాల, చిత్తూరు, అనంతపురం, కర్నూలు తదితర పట్టణాలు ఇందులో ఉన్నాయి.
సెప్టెంబర్ 3, 8, 15.. మూడు కీలక తేదీలు:- మొదటి విడతలో ప్రొద్దుటూరు, రాయచోటి, రాయదుర్గం, పుట్టపర్తి, బద్వేల్, నగరి, పుత్తూరు, కదిరి, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, పలమనేరు, తిరుపతి వంటి పట్టణాల్లోనూ సెప్టెంబర్ 3 నాటికి వార్డుల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసేలా షెడ్యూల్లో పేర్కొన్నారు.
రెండో దశలో (సెప్టెంబర్ 8) గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ఏలూరు, మచిలీపట్నం, పెడన, పిఠాపురం, ఒంగోలు, గుంటూరు, కడప, ధర్మవరం, తాడిపత్రి, నంద్యాలల్లో 8వ తేదీ నాటికి డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
మూడో దశలో చిలకలూరిపేట, నెల్లూరు పట్టణ స్థానిక సంస్థల్లో సెప్టెంబర్ 15 నాటికి వార్డుల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. దీంతో 39 పట్టణ స్థానిక సంస్థల్లో డీలిమిటేషన్ ప్రక్రియను దశలవారీగా పూర్తి చేసేలా మున్సిపల్ శాఖ కార్యాచరణ రూపొందించింది
ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రాథమిక ప్రక్రియల్లో వార్డుల హద్దుల నిర్ణయం ముఖ్యమైన అంశం కావడంతో, 39 పట్టణ స్థానిక సంస్థల్లో డీలిమిటేషన్ను నిర్ణీత గడువుల్లో పూర్తి చేసే దిశగా మున్సిపల్ శాఖ ముందుకు సాగుతోంది. డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తవుతున్న కొద్దీ స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లలో తదుపరి ప్రక్రియలకు మార్గం సుగమం కానుంది.

