AP&TG

ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ గా ఎమ్మెల్సీ నాగబాబు నియామకం

క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు..

త్వరలో‌ బాధ్యతలు చేపట్టనున్న నాగబాబు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనం, అటవీ విస్తీర్ణం, పర్యావరణ పరిరక్షణకు మరింత ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్‌రిచ్‌మెంట్ (ఏపీ గ్రీన్)’ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు కొణిదెల నాగేంద్రరావు (శ్రీ నాగబాబు)ని నామినేట్ చేస్తూ రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ G.O.Rt.No.93, తేదీ 17-08-2026ను జారీ చేసింది. ఈ నియామకంతోపాటు, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నాగేంద్రరావుకి క్యాబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

2047 నాటికి 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యం:- ఆంధ్రప్రదేశ్‌లో అటవీ పరిరక్షణ, పచ్చదనం పెంపు కలిపి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50 శాతానికి పెంచడం ఏపీ గ్రీన్ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని 2047 నాటికి సాధించే దిశగా ఏపీ గ్రీన్ పనిచేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేయడానికి ఏపీ గ్రీన్ గవర్నింగ్ బోర్డు, ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు జిల్లాస్థాయిలో పాలక మండళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఏపీ గ్రీన్ లక్ష్యాలు, కార్యక్రమాల అమలులో వివిధ శాఖలు, జిల్లాస్థాయి సంస్థల మధ్య సమన్వయం సాధించడం, కార్యక్రమాల అమలును వేగవంతం చేయడం, వాటి పురోగతిని పర్యవేక్షించడం వంటి కీలక బాధ్యతలను ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నాగబాబు నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే పచ్చదనం పెంపు, పునర్వనీకరణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు జిల్లాస్థాయి వ్యవస్థలను అనుసంధానిస్తూ సమర్థవంతమైన అమలు వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ నియామకం కీలకంగా నిలవనుంది. రాష్ట్ర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పర్యావరణ సమతుల్యతను కాపాడటం, అడవులు, చెట్ల విస్తీర్ణాన్ని పెంచడం, పునర్వనీకరణ కార్యక్రమాలను విస్తృత స్థాయిలో చేపట్టడం వంటి అంశాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదనడానికి ఏపీ గ్రీన్ ఏర్పాటు, దాని ఎగ్జిక్యూటివ్ కమిటీకి చైర్‌పర్సన్ నియామకం నిదర్శనంగా నిలుస్తుంది.

నాగబాబు నాయకత్వంలో ఏపీ గ్రీన్ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా మరింత సమర్థవంతంగా ముందుకు సాగుతాయని, “పచ్చని ఆంధ్రప్రదేశ్ – ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్” లక్ష్య సాధనకు ఈ వ్యవస్థ దోహదపడుతుందని ఆశాభావం కూటమి భాగస్వామ్య పార్టీల నుండి వ్యక్తమవుతోంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *