రాబోయే 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం-విపత్తుల నిర్వహణ సంస్థ
అమరావతి: వాయవ్య బంగాళాఖాతం,దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్-ఉత్తర ఒడిశా తీరప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలపడి కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.ఇది రాబోయే 24 గంటల్లో వాయవ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో వాయవ్య, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తరాంధ్ర తీరప్రాంతాల్లో మంగళవారం వరకు గంటకు 40 నుండి 60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. సముద్రం అలజడిగా ఉండి, అలలు ఎగసిపడే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. రానున్న రెండు రోజులు వాతావరణం కింద విధంగా ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది.
సోమవారం:- శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంది. మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, మార్కాపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది.
మంగళవారం:- ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

