బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం
సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నంలోపు..
అమరావతి: వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎం.డీ ప్రఖర్ జైన్ తెలిపారు. వాయుగుండం ప్రభావంతో సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నంలోపు పారాదీప్–సాగర్ ద్వీపాల మధ్య ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాన్ని దాటే అవకాశం వుందన్నారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55–65 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో 7 మీటర్ల కంటే తక్కువ పొడవు గల పడవలతో సముద్రంలోకి వెళ్లడం సురక్షితం కాదని హెచ్చరించారు. మత్స్యకారులు బుధవారం వరకు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు. తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

