రాష్ట్రానికి CGGPOA కోసం రూ. రూ.2,534 కోట్లను కేటాయించిన కేంద్రం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధాని అమరావతికి కీలక ప్రాజెక్టులను ప్రకటించింది. సీపీడబ్ల్యూడీ ప్రతిపాదనలకు అనుకూలంగా రూ.2,534కోట్లతో అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామడేషన్ (CGGPOA) ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
అమరావతిలో 5.35 ఎకరాల్లో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కోసం రూ.1,299.08కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాలకు రూ.1,234.91 కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. స్మార్ట్ సిటీ రూపకల్పనలో భాగంగా ఆధునిక సౌకర్యాలతో నిర్మించే ఈ కాంప్లెక్స్ ద్వారా రాష్ట్రంలో కేంద్ర నిధులు, కార్యాలయాల సమన్వయం మరింత సులభతరం కానుందని అధికారులు తెలిపారు.17 ఎకరాల్లో కేంద్ర ఉద్యోగుల కోసం క్వార్టర్స్ ను నిర్మించనున్నారు.ఈ గృహాల ద్వారా ఉద్యోగులు సౌకర్యవంతమైన నివాసాలు ఏర్పాటు అవుతాయి. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాల ప్రాజెక్టుల కోసం ఇప్పటికే డీపీఆర్ కూడా పూర్తి అయింది. ఇప్పటికే అమరావతిలో ఇప్పటికే పలు కేంద్ర ప్రభుత్వ విభాగాలు, వాటి అనుబంధ సంస్థలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ఇవన్నీ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించడంతో ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెరగనుంది.
