శుక్రవారం నెల్లూరు జిల్లా గూడూరులో 44.6 డిగ్రీలు-విపత్తుల నిర్వహణ సంస్థ
అమరావతి: రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మరో మూడు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
శనివారం- వర్షాలు:– వాతావరణ సూచనల ప్రకారం శనివారం పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఉష్ణోగ్రతలు:- రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42- 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని తెలిపారు.అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40-42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
శుక్రవారం:- నెల్లూరు జిల్లా గూడూరులో 44.6 డిగ్రీలు, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 43.7, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 43.3, కృష్ణా జిల్లా కానుమోలు, మన్యం జిల్లా సాలూరులో 43.1, ప్రకాశం జిల్లా కరేడులో 43, విజయనగరం జిల్లా రాజాంలో 42.7, అనకాపల్లి జిల్లా రాజాంలో 42.6, బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం, ఏలూరు జిల్లా నారాయణపురం, తిరుపతి జిల్లా పూలతోటలో 42.3 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

