పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు-జాయింట్ కలెక్టర్
నెల్లూరు: పేద ప్రజలకు అందాల్సిన పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. వెంకటాచలం సీతారాం టోల్ప్లాజా వద్ద సివిల్ సప్లైస్ శాఖ అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా AP 39 T 3519 నంబరు గల లారీలో సుమారు 33 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ బియ్యం గుంటూరు జిల్లా నుంచి తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న లారీతో పాటు పీడీఎస్ బియ్యాన్ని సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో భద్రపరిచి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పీడీఎస్ సరుకుల అక్రమ రవాణాపై నిరంతర నిఘా కొనసాగుతుందని, అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

