ఉప ముఖ్యమంత్రి పవన్ ఇంటికి వెళ్లి పరామర్శించిన ప్రధాని మోదీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొద్దిరోజుల క్రితం శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి విదితమే. వైద్యుల సూచన మేరకు ఆయన ప్రస్తుతం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో పూర్తి విశ్రాంతిలో ఉన్నారు. ఆదివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ఉప ముఖ్యమంత్రి పవన్ ఇంటికి వెళ్లారు. పవన్ను పరామర్శించారు. పవన్ ఆరోగ్య పరిస్థితి గురించి ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణలో మౌలిక సదుపాయాలు:- ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా ఆదివారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో..‘9,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన కోసం తెలంగాణకు విచ్చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం. తెలంగాణలో మౌలిక సదుపాయాలు, రవాణా అనుసంధానం, యువతకు కొత్త అవకాశాలను సృష్టించటంతో పాటు రాష్ట్ర ప్రగతిని వేగవంతం చేయడానికి ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలంగాణ అభివృద్ధిపై నిరంతరం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నందుకు జనసేన పార్టీ తరఫున ప్రధాని మోదీకి నా ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

