ఆక్రమిత స్థలంలో నిర్మించిన 6 ఇళ్లను తొలగించిన కార్పరేషన్ అధికారులు
ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటాం-కమీషనర్
నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలోని కొండాయపాలెం, ఇస్కాన్ సిటీ నుంచి హనుమాన్ జంక్షన్ మధ్యన ఉన్న పార్క్ ఏరియాలో అనధికారికంగా ఆక్రమిత స్థలంలో నిర్మించిన 6 ఇళ్లను నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నందన్ ఆదేశాల మేరకు మంగళవారం తొలగించారు. అనధికార నిర్మాణాల తొలగింపు కార్యక్రమం టౌన్ ప్లానింగ్ సిటీ ప్లానర్ రఘునాధరావు, ఏ.సీ.పీ వేణు, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ మురళి నేతృత్వంలో నిర్వహించారు. పట్టణ అభివృద్ధి నిబంధనల ప్రకారం, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, పార్క్ ఏరియాను ప్రజలకు అందుబాటులో ఉంచే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకొని, సిబ్బంది సమన్వయంతో ఈ అనధికార నిర్మాణాల తొలగింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. భవిష్యత్తులో కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ భూములు, పార్కులు, రహదారులు వంటి ప్రజా ఆస్తులపై జరిగే అనధికార ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

