మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కొత్త నిబంధనలను జారీ చేసిన ప్రభుత్వం
అమరావతి: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కొత్త నిబంధనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది. మున్సిపల్ (సవరణ) చట్టం-2026 అమలుకు గ్రీన్ సిగ్నల్ అనుమతి ఇస్తూ, ఆగస్టు 28వ తేదీ నుంచే చట్టసవరణ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు జీవో నంబర్- 210ని జారీ చేసింది. మేయర్, కార్పొరేటర్ల ఎన్నికల నియమావళిని ఖరారు చేస్తూ మరో జీవో నంబర్-211ని పురపాలక శాఖ జారీ చేసింది. నామినేషన్ డిపాజిట్లను జనరల్ అభ్యర్థులకు రూ.5,000, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.2,500 డిపాజిట్ చేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఒక అభ్యర్థి గరిష్ఠంగా 4 సెట్ల నామినేషన్లు మాత్రమే వేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అభ్యర్థుల నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలపై నోటరీతో కూడిన అఫిడవిట్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. పోలింగ్ కేంద్రాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే ఓటు రద్దు చేస్తామని అలాగే బ్యాలెట్ పేపర్ వెనక్కు తీసుకునే సర్వాధికారాలు ప్రిసైడింగ్ అధికారికి అప్పగించినట్లు వెల్లడించింది.

