AGRICULTUREAP&TGOTHERS

కృష్ణాజలాలకు జలహారతితో వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభించిన సీ.ఎం చంద్రబాబు

4.47 లక్షల ఎకరాలకు సాగునీరు..

23 లక్షల మందికి తాగునీరు..

అమరావతి: యర్రగొండపాలెం నియోజకవర్గం గంటవానిపల్లి సమీపంలో వెలిగొండ ఫీడర్ కెనాల్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం కృష్ణాజలాలకు జలహారతి ఇచ్చారు.కృష్ణమ్మకు హారతి ఇచ్చి పసుపు, కుంకుమ, చీరను సమర్పించారు. మార్కాపురం వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ శ్రీశైలం జలాశయంలోని కొల్లం వాగు నుంచి నీటిని గ్రావిటీ ద్వారా తెస్తున్నాం.53 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు.

రూ.10,200 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో రూ.7,983 కోట్లు ఖర్చు పెట్టి మొదటి దశను 18.8 కిలో మీటర్ల మేర జంట సొరంగాలు, 21.8 కిలోమీటర్ల ఫీడర్ కాలువల పనులు పూర్తి చేశాం అన్నారు.కేవలం 48 రోజుల్లో 6,206 నిర్వాసిత కుటుంబాలకు అక్షరాలా రూ.768 కోట్ల పరిహారం అందించామని వెల్లడించారు. కృష్ణమ్మ రాకతో పశ్చిమ ప్రకాశంలో ఫ్లోరైడ్ అనే పదం గత చరిత్రగా మిగిలిపోతుందన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి దశలో భాగంగా నల్లమల సాగర్‌కు 10.70 టీఎంసీల నీటిని తెస్తామని, దీని ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు లభిస్తుందని తెలిపారు.  మొత్తం ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 30 మండలాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుందని వెల్లడించారు.ఇందులో  ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 3.36 లక్షల ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 84 వేల ఎకరాలు, కడప జిల్లాలో 27 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టి పాటిరవికుమార్, డీబీవీ స్వామి, ఆనం రామనారాయణరెడ్డి, కందుల దుర్గేష్,  అనగాని సత్యప్రాద్, పార్ధసారధి, ఎంపీ శ్రీనివాసరెడ్డి,  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, జిల్లా ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *