ఆయుర్వేద థెరపీ కోసం కేరళంకు వెళ్లనున్న పవన్ కళ్యాణ్
అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం కేరళం రాష్ట్రానికి వెళ్లనున్నారు. ఇటీవల ముంబైలో కుడి భుజం రొటేటర్ కఫ్ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయన, వైద్యుల సూచన మేరకు తదుపరి చికిత్సలో భాగంగా ఆయుర్వేద థెరపీ చేయించుకోనున్నారు. శస్త్ర చికిత్స అనంతరం వైద్యులు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. కొంతకాలం బహిరంగ కార్యక్రమాలు , విధులకి దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. పాలనా బాధ్యతల దృష్ట్యా వారం రోజుల్లోనే పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయానికి అందుబాటులోకి వచ్చారు. ముందస్తుగా ఖరారైన ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడం, వరుసగా శాఖాపరమైన సమీక్షలు, పార్టీ అంతర్గత సమావేశాలను నిర్వహించడం చేశారు. ఈ క్రమంలో శస్త్ర చికిత్స చేసిన భుజం భాగంలో వాపు పెరగడంతోపాటు తీవ్రమైన జ్వరం కూడా వచ్చింది. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు భుజం పూర్తిస్థాయిలో కోలుకునేందుకు కేరళంలో ప్రత్యేక ఆయుర్వేద థెరపీ చేయించుకోనున్నారు.

