బలూచిస్తాన్ ప్రజలపై పాక్ ఆర్మీ వైమానిక దాడులు-28 మంది మృతి
అమరావతి: బలూచిస్తాన్లో పాకిస్తాన్ ఆర్మీ మంగళవారం అర్ధరాత్రి జరిపిన వైమానిక దాడిలో 28 మంది పౌరులు మరణించగా, 17 మందికిపైగా గాయపడ్డారు. అంతర్జాతీయ మీడియా ఈ వివరాల్ని వెల్లడించింది. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలూచిస్తాన్లో ప్రజలతోపాటు, ఉద్యమకారులు ఆందోళన చేస్తున్నారు. పాక్ ప్రభుత్వ అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా రెండు నెలల నుంచి పోరాడుతున్నారు.
అర్ధరాత్రి 2.00 గంటలకు:- బలూచిస్తాన్లోని సూరబ్ జిల్లాలోని గోంధం గ్రామంపై అర్ధరాత్రి 2.00 గంటలకు పాక్ ఆర్మీ వైమానిక దాడి చేసింది. ఇళ్లల్లో నిద్రిస్తున్న వారిపై దాడి చేయడంతో 28 మంది పౌరులు మరణించారు. కూలిన ఇండ్ల శిథిలాల కింద మరింతమంది చిక్కుకున్నారు. వారిలో పిల్లలు, యువత కూడా ఉన్నారు. చాలా మంది నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో తొమ్మిది మంది పిల్లలు, ఏడుగురు మహిళలు సహా 12 మంది పురుషులు ఉన్నారు.
మిస్సైల్స్, డ్రోన్స్ ప్రయోగం:- పాక్ పోలీసులతోపాటు ఏకంగా పాక్ ఆర్మీని ప్రయోగిస్తోంది. ఉద్యమకారులతోపాటు సాధారణ ప్రజల్ని కూడా కాల్చిచంపుతోంది. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న వారిపై కూడా వైమానిక దాడులకు దిగుతోంది. మిస్సైల్స్, డ్రోన్స్ ప్రయోగిస్తోంది. పిల్లలు, మహిళలు, వృద్ధులు కూడా ఈ ఘటనల్లో మరణిస్తున్నారు.
పిల్లల మృతదేహాలు:- ఈ సంఘటనపై పాక్ మిలిటరీ మాత్రం స్పందించలేదు. ఈ దాడిలో పిల్లల మృతదేహాలు ముక్కులుగా, చెల్లాచెదురుగా పడిపోయాయి. అక్కడి పరిస్థితులు హృదయవిదారకంగా ఉన్నాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రుల్లో చేర్చి, చికిత్స అందిస్తున్నారు. సాధారణ ప్రజలపై పాక్ ఆర్మీ దాడి చేయడం ఇదే మొదటిసారి కాదు. అక్కడ ఉద్యమాల్ని పాక్ ఆర్మీ దారుణంగా అణచివేస్తుంది.

