శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కు ప్రధాన కార్యనిర్వహణ అధికారిగా జితేంద్ర మిశ్ర
అమరావతి: అయోధ్య రామ మందిరం నిర్వహణం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కు ప్రధాన కార్యనిర్వహణ అధికారి (CEO)గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్ర నియమితులయ్యారు. ట్రస్ట్ సమావేశంలో ఆయన పేరుకు ఆమోదం లభించింది.
భారత వైమానిక దళంలో కీలక బాధ్యతలు నిర్వహించిన జితేంద్ర మిశ్ర, ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో వెస్ట్రన్ కమాండ్కు నాయకత్వం వహించారు. ఆయనకు సైనిక పరిపాలన, నాయకత్వం, నిర్వహణలో విస్తృత అనుభవం ఉంది. జితేంద్ర మిశ్రా 39 ఏళ్ల సేవ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 30న పదవీ విరమణ చేశారు. జితేంద్ర మిశ్రా భారత వైమానిక దళంలో సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ అధికారి. నివేదికల ప్రకారం, ఆపరేషన్ టైగర్ హిల్, ఆపరేషన్ సఫేద్ సాగర్ వంటి కీలక సైనిక కార్యకలాపాల్లో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. రామ మందిర ట్రస్ట్ కు CEO నియామక ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా మొత్తం 5,585 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించిన అనంతరం అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేసి, చివరకు ముగ్గురు అభ్యర్థులతో కూడిన తుది ప్యానెల్ను ట్రస్ట్ కు సమర్పించారు.
రామ మందిర నిర్మాణం, ఆలయ నిర్వహణ, భక్తుల దర్శన వ్యవస్థ, పరిపాలనా వ్యవహారాలు వంటి అంశాలు మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక CEO నియామకం ద్వారా ట్రస్ట్ పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

