ఆదివారం పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం
అమరావతి: బంగాళాఖాతంలో వాతావరణం మార్పులతో సముద్రంలో కదలికలు కారణంగా శ్రీలంకకు దక్షిణ ప్రాంతంలో శుక్రవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న రోజుల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం వుందని వాతావరణశాఖ పేర్కొంది. అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో భారీ మార్పులు జరిగే అవకాశం వుంది. ఒక వైపు మండే ఎండలు, మరోవైపు పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
తీవ్రవడగాలులు:- మరోవైపు అల్లూరి జిల్లా అనంతగిరి, పోలవరం జిల్లా గుర్తేడు, అనకాపల్లి జిల్లా కె. కోటపాడు మండలాల్లో (3) తీవ్రవడగాలులు, అలాగే అల్లూరి జిల్లా ముంచింగిపుట్టు, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం,చీడికాడ, చోడవరం, దేవరపల్లి, మాడుగుల, పరవాడ మండలాల్లో(7) వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
తేలికపాటి వర్షాలు:- ఆదివారం మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణశాఖ పేర్కొంది.

