“ఆపరేషన్ సింధూర్”లో వీరమరణం పొందిన ఆరుగురు సైనికుల పేర్లను వెల్లడించిన ప్రభుత్వం
అమరావతి: జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా, పాకిస్థాన్-పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PojK)లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని 2025 మే 7వ తేదీన భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో వీరమరణం పొందిన ఆరుగురు భారత సాయుధ దళాల సిబ్బంది వివరాలను ప్రభుత్వం మొదటిసారిగా బహిర్గతం చేసింది.ఈ ఆపరేషన్లో వీరమరణం పొందిన సైనికులు పేర్లను వెల్లడించారు. దేశ రాజధానిలో ఉన్న జాతీయ యుద్ధ స్మారకంపై ఆ ఆరుగురు సైనికుల పేర్లను చేర్చనున్నట్లు సైన్యం తెలిపింది. మిలిటరీకి చెందిన సుబేదార్ మేజర్ పవన్ కుమార్, రైఫిల్మాన్ సునిల్ కుమార్, లాన్స్ నాయక్ దినేశ్ కుమార్, అగ్నీవీర్ మురళీ నాయక్, హవిల్దార్ సునిల్ కుమార్ సింగ్తో పాటు భారతీయ వైమానిక దళానికి చెందిన సురేంద్ర కుమార్ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు వీర సైనికులతో పాటు 2025లో జరిగిన వివిధ మిలిటరీ ఆపరేషన్స్లో అమరులైన సైనికుల పేర్లను విడుదల చేశారు. నేషనల్ వార్ మెమోరియల్లో ఉన్న త్యాగ చక్ర వద్ద ఆ ఆరుగురు సైనికుల పేర్లను చేర్చనున్నారు.

