నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు.త్వరలో కొత్త తేదిలు ప్రకటిస్తాం-ఎన్.టీ.ఏ
అమరావతి: నీట్ యూజీ 2026 MAY 3వ తేదీన నిర్వహించిన పరీక్షను రద్దు చేసినట్లు మంగళవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది.మళ్లీ నీట్ పరీక్ష నిర్వహణకు సంబంధించి కొత్త తేదీలను త్వరలో వెల్లడించనున్నట్లు పేర్కొన్నది. దేశవ్యాప్తంగా మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ యూజీ 2026 పరీక్షను ఎన్.టీ.ఏ నిర్వహించింది. దేశవ్యాప్తంగా 552 నగరాలు, 14 అంతర్జాతీయ కేంద్రాలతో కలిపి దాదాపు 20 లక్షల మందికి పైగా విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు. అయితే మే 3వ తేదిన నిర్వహించిన NEET పరీక్షలో విద్యార్థులు ఎదుర్కొన్న ప్రశ్నలను పోలిన 100 ప్రశ్నలు పరీక్ష జరగడానికి ముందే సర్క్యులేట్ అయినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై రాజస్థాన్ పోలీసులు విచారణ చేపట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు, పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఎగ్జామ్ ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు అనుమానిస్తున్నారు.

పరీక్ష విధానంపై నమ్మకం సడలకుండా:- ఈ సంఘటనపై సమగ్ర విచారణ కోసం ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది.మే 3వ తేదిన పరీక్షలకు హజరైన అభ్యర్దులు కొత్తగా రిజిస్ట్రేషన్ అవసరం లేదని, అదనపు ఎగ్జామ్ ఫీజు కూడా అవసరం లేదని వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ డేటా, ఎగ్జామ్ సెంటర్లను యధావిధిగా కొనసాగించనున్నారు.విద్యార్థుల ప్రయోజం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన ప్రకటనలో ఎన్టీఏ పేర్కొన్నది. జాతీయ పరీక్ష విధానంపై నమ్మకం సడలకుండా ఉండేందుకు మళ్లీ పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది.ఇది విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు ఇబ్బందిని కలిగించే అంశమే, కానీ జరిగిన పరిణామాల దృష్ట్యా మళ్లీ పరీక్ష నిర్వహించడమే ఉత్తమం అని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఎన్ఏటీ పేర్కొన్నది. ఒకవేళ ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్తే అప్పుడు నష్టం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఎన్టీఏ తెలిపింది.పరీక్ష తేదీ, అడ్మిట్ కార్డుకు సంబంధించిన అంశాల కోసం అధికారిక సమాచారాన్ని మాత్రమే చూడాలని, సోషల్ మీడియాలో ప్రచారం అయ్యే అంశాలను పట్టించుకోవద్దు అని ఎన్టీఏ సూచించింది.

