తమిళనాడులో 74 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించిన ఈసీ
అమరావతి: తమిళనాడు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పూర్తికావడంతో తుది జాబితాను ఎన్నికల సంఘం సోమవారంనాడు విడుదల చేసింది. చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమిళనాడు చీఫ్ ఎలక్షన్ అధికారి అర్చనా పట్నాయక్ మాట్లాడుతూ సవరించిన జాబితాలో రాష్ట్రంలోని 74 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు.SIR ప్రక్రియకు ముందు 6.41 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారు. తుది జాబితాలో 5.67 కోట్ల మంది ఓటర్లు వున్నట్లుగా తేలింది. వీరిలో 2.77 కోట్ల మంది పురుషులు, 2.89 కోట్ల మంది మహిళలు 7,617 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. క్లెయిమ్లు, అబ్జెక్షన్ పీరియడ్లో దాఖలు చేసిన దరఖాస్తులను సమీక్షించి మార్పులు చేసినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. 2025 డిసెంబర్ 19 నుంచి 2026 జనవరి 30 వరకూ ఓటర్ల జాబితా నుంచి తమ పేర్లు తొలగించాల్సిందిగా 4.38 లక్షల అప్లికేషన్లు వచ్చాయని, వీటిలో 4.23 లక్షల ఎంట్రీలను వెరిఫికేషన్ అనంతరం తుది ఓటర్ల జాబితా నుంచి తొలగించామని పేర్కొంది.

