AP&TG

ఖైదీలకు క్షమాభిక్షపై ప్రభుత్వం సానుకూలం-హోం మంత్రి అనిత

అమరావతి: జైలులోని ఖైదీలకు క్షమాభిక్ష విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. సోమవారం 8వ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జైళ్లు, సంస్కరణల చట్టం సవరణపై బిల్లును అసెంబ్లీలో హోంమంత్రి అనిత ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ, ఖైదీల సంస్కరణల కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కేంద్రం తెచ్చిన చట్టం మేరకు ఇక్కడ కూడా సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. ఖైదీలు జైలులో ఉండి చదువుకునేలా అవకాశాలను మెరుగుపరుస్తున్నామని చెప్పారు.

ఖైదీల్లో పరివర్తన తీసుకురావటం కోసం చట్టంలో మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా ఖైదీల పిల్లల కోసం జైలులో ప్రత్యేకంగా అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఖైదీల నేరచరిత్ర, ప్రవర్తన ఆధారంగా కేటగిరీలుగా విభజిస్తామని పేర్కొన్నారు. ఖైదీలు మారేందుకు, మానసిక పరివర్తన తెచ్చేలా ఓపెన్ ఎయిర్ జైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఖైదీలు.. వ్యవసాయంతో పాటు ఇతర వృత్తులు నిర్వహించేలా చర్యలు చేపడతామన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *