రాబోయే 10 సంవత్సరాల్లో మానవాళిని ఏఐ అంతం చేసే అవకాశం-జాకబ్ కాక్సన్
మానవాళికి తీవ్ర ముప్పుగా మారే అవకాశం..
అమరావతి: ఆంత్రోపిక్ (Anthropic) పరిశోధకుడు జాకబ్ కాక్సన్ తన రాజీనామా చేసిన తర్వాత సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ, “AIని అభివృద్ధి చేస్తున్న వారు, ఈ దశాబ్దం ముగిసేలోపు అది మనందరినీ అంతం చేయగలదని బలంగా నమ్ముతున్నారు. ఇది కేవలం మార్కెటింగ్ కోసం చేసే పని కాదు.” అని పేర్కొన్నారు.
ప్రమాదకర పోటీ:- కృత్రిమ మేధ (AI) అభివృద్ధిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో జాకబ్ కాక్సన్ సంచలన హెచ్చరిక చేశారు. మనుషులకంటే తెలివైన, తనను తాను నిరంతరం అభివృద్ధి చేసుకునే AI వ్యవస్థలు దశాబ్దం ముగిసేలోపే మానవాళికి తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు ఈ ఆందోళనల కారణంగానే ఆంత్రోపిక్ నుంచి వైదొలుగుతున్నట్లు కాక్సన్ ప్రకటించారు. కాక్సన్ గత మూడు సంవత్సరాల్లో ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ సంస్థల్లో ఏఐ మోడళ్ల శిక్షణకు సంబంధించిన పరిశోధనలు చేశారు. ఈ రెండు సంస్థలూ అత్యంత శక్తిమంతమైన, స్వయం-అభివృద్ధి చెందగల AIని తయారు చేసేందుకు ప్రమాదకర పోటీలో పడ్డాయని విమర్శించారు.
మానవాళిని ఏఐ అంతం చేసే:- ఆంత్రోపిక్ అలైన్మెంట్ సైన్స్ లీడ్గా ఉన్న ఇవాన్ హుబింగర్ కూడా కాక్సన్ తరహాలోనే స్పందించారు. తన వ్యక్తిగత అంచనా ప్రకారం, వచ్చే పదేళ్లలో మానవాళిని ఏఐ అంతం చేసే అవకాశం 10 శాతానికి మించి ఉందని అభిప్రాయపడ్డారు (AI extinction risk). రికర్సివ్ సెల్ఫ్-ఇంప్రూవ్మెంట్ వల్ల సూపర్ఇంటెలిజెన్స్ ఏర్పడటం మానవాళికి నిజమైన సవాలు అని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఏఐ సంస్థలు పరస్పరం సమన్వయం చేసుకుని భద్రతా ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

