రైతుల ఆదాయం పెంచే సాంకేతికతను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి-జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల
అగ్రి ఎక్స్ పోలో ప్రదర్శించిన పరిజ్ఞానం ప్రతి రైతుకు చేరాలి..
వ్యవసాయ యంత్ర పరికరాల పట్ల రైతుల ఆసక్తి..
నెల్లూరు: వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ సాగు విధానాలను క్షేత్రస్థాయిలో ప్రతి రైతుకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల సూచించారు. అగ్రి ఎక్స్ పోలో ప్రదర్శించిన సాంకేతికత కేవలం ప్రదర్శనకే పరిమితం కాకుండా రైతుల పొలాల్లో ఆచరణలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నెల్లూరులోని ఏ.సి. సుబ్బారెడ్డి స్టేడియంలో బుధవారం నిర్వహించిన అగ్రి ఎక్స్ పో & కిసాన్ మేళా–2026 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని వివిధ స్టాల్స్ను సందర్శించారు. వ్యవసాయ యంత్రాలు, డ్రోన్లు, ఆధునిక సాంకేతిక పరికరాలు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులను పరిశీలించి, వాటి వినియోగం, రైతులకు కలిగే ప్రయోజనాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతుల అవసరాలు, క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతుల అవగాహన తదితర అంశాలపై కలెక్టర్ రైతులు, చాంపియన్ ఫార్మర్స్, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో ముఖాముఖిగా చర్చించారు. రైతులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడమే ఇటువంటి ఎక్స్ పోల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
సాంకేతికత,యాంత్రీకరణ,శాస్త్రీయ సాగు:- అగ్రి ఎక్స్ పోలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి సుమారు 1,000 మంది రైతులు పాల్గొన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ యాంత్రీకరణ, పంటల సాగు, పంటల ఆరోగ్యం, నీటి యాజమాన్యం, వ్యవసాయ అనుబంధ రంగాలు, ప్రభుత్వ పథకాలపై ఒకే వేదికగా అవగాహన కల్పించారు. వివిధ వ్యవసాయ యంత్రాలు, డ్రోన్లు, ఆధునిక సాగు పరికరాలు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఇతర సాంకేతిక ఉత్పత్తులను రైతులకు ప్రత్యక్షంగా ప్రదర్శించారు. వ్యవసాయ యంత్ర పరికరాల పనితీరు, వాటి వినియోగం, ప్రయోజనాలను తెలుసుకునేందుకు రైతులు ఆసక్తి చూపారు. తయారీదారులు, శాస్త్రవేత్తలు, అధికారులు రైతులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు.

