జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ
అట్టహాసంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు..
అలరించిన సాంస్కృతిక,శకటాల ప్రదర్శనలు..
నెల్లూరు: 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. శనివారం నెల్లూరు నగరంలోని పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్లతో కలిసి మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ 80వ స్వాతంత్ర్య దినోత్సవ సందేశాన్ని, జిల్లా ప్రగతి నివేదికను ప్రజలకు వివరించారు.
ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు:- 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ మైదానంలో విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.
అభివృద్ధి, సంక్షేమ శాఖల శకటాలు:- రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ సాగిన వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ శకటానికి మొదటి స్థానం, పంచాయతీరాజ్-గ్రామీణ నీటి సరఫరా శాఖల శకటాలకు ద్వితీయ స్థానం, జిల్లా వ్యవసాయ శాఖ, పరిశ్రమల శాఖ శకటాలకు తృతీయ స్థానం లభించాయి.
విశిష్ట సేవలందించిన వారికి ప్రశంసాపత్రాలు:- 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బందికి, వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన కళాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు మంత్రి నారాయణ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను, పోలీసు అధికారులకు సేవా పతకాలను అందజేశారు.

