అనుమానాస్పద స్థితిలో లష్కరే తోయిబా కమాండర్ ఖారీ సయీద్ అబ్దుల్ అజీజ్ మృతి
అమరావతి: గుర్తు తెలియని సమస్యతో పాకిస్థాన్లో లష్కరే తోయిబాకు చెందిన మరో కీలక కమాండర్ చచ్చిపోయాడు. లష్కరే సంస్థ సీనియర్ కమాండర్ అయిన ఖారీ సయీద్ అబ్దుల్ అజీజ్ ఇస్లామాబాద్లోని ఖుబా మసీదు వద్ద అకస్మాత్తుగా కుప్పకూలి మరణించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. అతడి మరణానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు.
ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు:- ప్రార్థనల కోసం మసీదుకు వెళ్లే ముందు అబ్దుల్ అజీజ్ ఓ రెస్టారెంట్లో భోజనం చేసినట్లు సమాచారం. అనంతరం ఇస్లామాబాద్లోని ఖుబా మసీదుకు చేరుకున్న సమయంలో ప్రవేశ ద్వారం వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కొద్దిసేపటికే ఆయన మరణించినట్లు తెలుస్తోంది. విషప్రయోగం జరిగిందా, అనారోగ్యంతో మరణించాడా లేదా మరేదైనా కారణమా అన్నది అధికారికంగా వెల్లడికాలేదు.
ఉగ్రవాదులను భారత్లోకి చొప్పిస్తుంటాడు:- అబ్దుల్ అజీజ్ లష్కరే తోయిబాకు సంబంధించి జమ్ము, కశ్మీర్లో ప్రవేశించే ఉగ్రవాదులకు సేఫ్హౌస్లు, ఆర్థిక సహాయం, తప్పుడు పత్రాలు సమకూర్చడం వంటివి చేస్తుంటాడు. నీలమ్ వ్యాలీ, ముజఫరాబాద్ మీదుగా ఉగ్రవాదులను భారత్లోకి చొప్పిస్తుంటాడు.
గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో 30 మంది:- ఇటీవలె లష్కరే తోయిబాకు చెందిన కీలక నేత రిజ్వాన్ హనీఫ్ మాట్లాడుతూ గత మూడేళ్లలో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో లష్కరే తోయిబాకు చెందిన 30 మందికి పైగా సభ్యులు గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతమైనట్లు వెల్లడించాడు. ఈ హత్యలకు భారత నిఘా వర్గాలే కారణమని హనీఫ్ ఆరోపించాడు. అయితే ఆ ఆరోపణలను భారత్ ఖండించింది.

