అమరావతిని దేశ ప్రధాన నగరాలతో అనుసంధానం చేస్తాం- కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
ఏపీ రైల్వే అభివృద్ధికి రూ.10,144 కోట్లు..
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ రైల్వే రంగం విప్లవాత్మక మార్పులను చవిచూస్తోందని, వికసిత భారత్ లక్ష్య సాధనలో రైల్వేలు కీలక శక్తిగా మారాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. విజయవాడ సమీపంలోని రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్ను సోమవారం సందర్శించిన ఆయన, స్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.35 కోట్లను ఖర్చు చేసినట్లు తెలిపారు.
ఏపీకి పెద్ద ఎత్తున నిధులు:- ఆంధ్రప్రదేశ్లో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.10,144 కోట్లను కేటాయించినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి వెల్లడించారు. రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లు, స్టేషన్ల ఆధునికీకరణ, ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదల, సరుకు రవాణా సామర్థ్యాల పెంపు వంటి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో దేశంలోని ప్రధాన నగరాలను అనుసంధానించే కీలక రైల్వే మార్గాలు అమరావతికి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దీంతో రాజధాని ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో కలిసి కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్తోందని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.

