NATIONAL

సెమీకండక్టర్ 2.0, మొబైల్ ఫోన్ తయారీ,యూరియా రంగాలకు రూ.2,19,353 కోట్లు

కేంద్ర కేబినెట్ నిర్ణయాలు…

అమరావతి: దేశంలో తయారీ, మౌలిక వసతులు, వ్యవసాయం, రైల్వే రంగాలకు ఊతమిచ్చేలా కేంద్ర క్యాబినెట్ బుధవారం ఏడు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో మొత్తం రూ.2,19,353 కోట్ల విలువైన భారీ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. దేశాన్ని సెమీకండక్టర్ల తయారీ రంగంలో గ్లోబల్ హబ్‌గా మార్చడం, మొబైల్ ఉత్పాదనను పెంచడం, ఎరువుల రంగంలో స్వయంసమృద్ధి సాధించడంతో పాటు వారణాసిలో ప్రతిష్ఠాత్మక ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు ఈ సమావేశంలో కేబినెట్ అమోదం తెలిపింది. క్యాబినెట్ సమావేశం అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.

  1. సెమీకాన్ 2.0:- భారతదేశాన్ని అంతర్జాతీయ చిప్ తయారీ కేంద్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ‘సెమీకండక్టర్ మిషన్ 2.0’ (Semicon 2.0) ను ప్రకటించింది. దీని కోసం ఏకంగా రూ.1,27,500 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ఈ నిర్ణయం ద్వారా దేశంలో అత్యాధునిక సెమీకండక్టర్ ప్లాంట్ల ఏర్పాటు, డిజైనింగ్, ప్యాకేజింగ్ పరిశ్రమలకు భారీగా ప్రోత్సాహం లభించనుంది.
  2. మొబైల్ ఫోన్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్:- ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో భారత్ సాధిస్తున్న దూకుడును మరింత పెంచేందుకు రూ.62,500 కోట్ల కేటాయింపుతో ‘మొబైల్ ఫోన్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్’ (MPMS) కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా స్థానిక మొబైల్ ఉత్పత్తి పెరగడమే కాకుండా, భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
  3. యూరియా జాతీయ పెట్టుబడి విధానం:- ఎరువుల రంగంలో భారతదేశాన్ని స్వయం సమృద్ధి దేశంగా మార్చేందుకు, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ‘నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ ఫర్ యూరియా-2026’ కు కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీని ద్వారా దేశీయంగా యూరియా ఉత్పత్తిని పెంచి రైతులకు కొరత లేకుండా చేయనున్నారు.
  4. వారణాసి (కాశీ) ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు:- పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసి రూపురేఖలను మార్చేలా రెండు భారీ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చింది.

వరుణా నది ఎలివేటెడ్ కారిడార్: రూ.10,998 కోట్ల వ్యయంతో వరుణా నది వెంబడి 6/4 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు.

గంగా నది ఎలివేటెడ్ కారిడార్: రూ.14,448 కోట్ల వ్యయంతో గంగా నది వెంబడి 6 లేన్ల అత్యాధునిక ఎలివేటెడ్ కారిడార్‌ను చేపట్టనున్నారు.

రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు:- దేశంలో సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు రెండు కీలక రైల్వే లైన్ల ప్రాజెక్టులకు క్యాబినెట్ ఓకే చెప్పింది.

పారాదీప్-హరిదాస్‌పూర్ రైల్వే లైన్: రూ.2,542 కోట్ల అంచనా వ్యయంతో ఈ రైల్వే లైన్ డబ్లింగ్ (రెండో లైన్) పనులను చేపడతారు.

డాంగోవాపోసి-రాజ్‌ఖర్సవాన్ నాలుగో లైన్: రూ.1,365 కోట్ల పెట్టుబడితో ఈ మార్గంలో నాల్గవ రైల్వే లైన్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కేవలం పారిశ్రామిక రంగానికే కాకుండా మౌలిక సదుపాయాల కల్పనకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఉన్నాయని, సెమీకండక్టర్, మొబైల్ తయారీ రంగాలు గ్లోబల్ మార్కెట్‌లో భారతదేశ స్థానాన్ని మరింత పటిష్ఠం చేయనున్నాయని మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *